Friday, January 2, 2009

కధావిహార్

ఎలా సాధ్యం?

-మన్నవ గంగాధర ప్రసాద్
రఘుపతి వస్తానని పోన్ చేశాడు.
సరే, రారా . ఇంటివద్దే ఉన్నాను అన్నాను.
ఈ మధ్య ఆరోగ్యం బాగలేదు. ఎటూ వెళ్లడంలేదు.
మితృలుకూడా చాలామంది రావడం తగ్గించేసారు. ఎవరి పనులు వాళ్లకు.. సమయం సరిపోవడంలేదేమో.
పనమ్మాయిని పిలిచి మేడమీద గది శుభ్రంచేయమన్నాను. ఆ గది నా సామ్రాజ్యం. అయితే అక్కడికి వెళ్లి చాలా వారాలయింది.
అంతకు ముందు ప్రతి శని, ఆదివారాలు నా మిత్రులతో, మేడపై గదిలో చాలా సరదాగా గడచిపోయేవి. కొందరితో పేక, కొందరితో చదరంగం, చందు, నాగరాజు వంటివారితో సాహిత్య చర్చ. ఇలా ఉండేది నా వారాంతపు జైత్రయాత్ర. వీరందరిలోకీ రఘుపతి నాకు ప్రాణస్నేహితుడు. మాది చిన్ననాటి స్నేహం. మావి పక్కపక్క ఊర్లు. వాడి ఊరి స్కూల్లో నేను రెండేళ్లు చదువుకున్నాను. అప్పటినుండీ స్నేహం గత యాభై ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. చిన్ననాటి స్నేహం పర్సులోని కరెన్నీనోట్లవంటిది. అప్పుడప్పుడూ తాకి చూచుకుంటే కలిగే ఆనందం వేరు. వాడు, వాడి ఆర్థిక స్థితి వాణ్ని డాక్టరు చదివించాయి. నేను ఓ కాలేజీ అధ్యాపకునిగా నాలుగేళ్లక్రితం రిటైరయ్యాను. నా కొడుకూ, కోడలూ కెనడాలోఉంటారు. నేనూ, శ్రీమతి ఇక్కడ హైదరాబాదులో మారేడ్పల్లిలో ఉంటాం. ఇక, డాక్టరుగా రఘుపతి బాగా సంపాయించాడు. ఇద్దరు కొడుకులు అమెరికాలో ఉన్నా, కూతురూ, అల్లుడూ ఇక్కడే ఉంటారు. వాడూ నేనూ నెలకోసారైనా కలుస్తూ ఉంటాం. వాడు మా యింటికి వస్తే అదో ప్రత్యేకమైన సందర్బం. వస్తూ వస్తూ వాడు ఖరీదైన విదేశీమద్యం సీసా తెస్తాడు. మా ఆవిడవేసే ఉల్లిపకోడీలు తింటూ ఏవేవో మాట్లాడుకుంటూ గడిపేస్తాం.
- - - -
మార్కెట్టుకు వెళ్లివచ్చి, భోంచేసి పడుకున్నాను. లేచేసరికి సాయంత్రం నాలుగు గంటలైంది, ఎంతగా నిద్రపట్టింది అనుకుంటూ.. స్నానంచేసి, టీ తాగుతూ కూచున్నా. ఇంతలో రఘుపతి రానే వచ్చాడు. వాడికి టీ అందించి క్షేమసమాచారం కనుక్కున్నది నా శ్రీమతి. కాసేపు అక్కడే కూచుని, మేడపైకి వెళ్లాం. వెళుతూనే.. టీవీ ఆన్ చేశా. ఆదివారం కదా పాత సినిమా ఏదైనా వస్తుందేమోనని. అయితే హోం మంత్రి పాటిల్ రాజీనామా చేశాడని ప్లాష్ న్యూష్. అలా మా మాటలు రాజకీయలలోకి మళ్లాయి. గత నాలుగురోజులుగా దేశాన్ని కుదిపివేసిన ముంబాయిపై దాడులు చర్చనీయాంశంగా మారింది. కళ్లు నీటితో నిండాయి. మనసు మూగబోయింది. ముష్కరులు ఎందుకోసం ఇంత దారుణానికి పాల్పడ్డారో నాకు అర్థంకాలేదు. ధనం కోసం కాదు, మతం కోసం కాదు. చనిపోయిన వారిలో అన్నిమతాల వారూ ఉన్నారు కదా అని నా అనుమానం. ఒక దేశాన్ని, దేశ సంపదనూ నాశనం చేయాలనుకునే.. ఉగ్రవాదులు ఇటువంటి దాడులకు పాల్పడుతుంటారేమో.. అని రఘ అన్నాడు. కానీ దీనివలన వారికి కలిగే లాభం ఏమిటి మా మనసులు ఆక్రోశించాయి.
పట్టుమని -20 ఏళ్ళు కూడాలేని యువకులు కరడుగట్టిన నరహంతకులుగా మారడానికి దోహదపడుతున్న అంశం ఏమిటో తెలుసుకోవలసిన అవసరం ప్రపంచానికి లేదా అని ప్రశ్నించుకున్నాం. మాలో వేల వేల సందేహాలు.. ఇంతలో వేడి పకోడి తీసుకువచ్చింది పనిమనిషి. అక్కడి వాతావరణం ఆమెకు అర్ధంకాలేదు. ఛలోక్తులతో సరదాగా ఉండేనాగదినిండా ఆవేదనల అలలు వ్యాపించి ఉండడం గమనించి ఎంతోనెమ్మదిగా వచ్చి ప్లేట్లు అక్కడ పెట్టి అంతే నెమ్మదిగా వెనక్కి వెళ్ళిపోయింది. ఒక దాడి ఎన్ని వేల లక్షల గుండెలను పిండి వేస్తుందో అర్ధమైంది నాకు.

ఆల్ కైదా, ముజాహిదీన్ ఎవరైనా ఇతరులను చంపడంద్వారా తాము సాధించగలుగుతున్నది ఏమిటి.. అని ప్రశ్నించుకున్నాం, సమాధానం లభించలేదు. ఊహలనిండా వేదన ఘనీభవించింది. దాడిలో చనిపోయినవారి త్యాగాలను స్మరించుకున్నాం. అపార్థానికి, ఆవేశానికి విజ్ఞత ఉండదని అన్నాను.నిజమే...మూర్ఖత్వం అంత త్వరగా పాఠాలు నేర్చుకోదని అన్నాడు రఘుపతి. మామధ్య కాసేపు మౌనం ఆవరించుకుంది.

ఒక్క క్షణం కళ్ళు మూసుకుని తిరిగి నావైపు చూసి నీకో సంఘటన చెప్పాలి . ఇది చరిత్ర, ఇది వాస్తవం.. ముంబై దాడుల నేపధ్యంలో ఇది నీకు చెప్పాలనిపించింది అని ఆగాడు.
చెప్పమని కళ్ళతోనే అర్ధించాను.
నేను డాక్టరుగా చాలా సమావేశాలకు హాజరయ్యేవాడిని. అలా అవయవ మార్పిడికి సంబంధించి ఓ సమావేశంలో ప్రసిద్దవైద్యుడు చేరనయ్య కలిశాడు. అపుడు మామధ్య అవయవ మార్పిడి గురించిన చర్చ జరిగింది. ప్రస్తుతం వైద్య శాస్త్రం ఈ అంశంపైనే తీవ్రంగా ఆలోచిస్తోంది. ఆ సమయంలో ఆయన ఈ విషయం చెప్పాడు. డా. చేరనయ్య దేశంలోనే ప్రముఖుడైన హ్రుద్యోగనిపుణుడు. ప్రస్తుతం పాకిస్తాన్ లో కూడా అయన స్వచ్చందంగా తన వైద్యసేవలందిస్తున్నారు, మన దేశంలో గుండెమార్పిడి చేసిన తొలి డాక్టర్ ఆయన. ఇక్కడ గుర్తించవలసినఅంశం ఏమిటంటే.. యాదృశ్చికంగా జరిగిన సంఘటన. మానవత్వానికీ, మంచితనానికీ ప్రేరణగా నిలిచిన సంఘటన కావడం. సరే, విషయానికి వస్తాను. డాక్టర్ తొలి గుండే ఆపరేషన్ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఓ మహిళకు గుండె మార్పిడి అత్యవసరంగా జరిపించాలి. దేశంలో అన్ని ప్రధాన నగరాలలోనూ దాతకోసం వెదుకుతున్నారు.. ఫలితం కనిపించలేదు. అపరేషన్ తేదీ దగ్గరపడింది. రోగికి ప్రాణాపాయం పెరిగిపోతోంది. ఏంచేయాలో పాలుపోలేదు. ఇలా ఉండగా ఓ రోజు రాత్రి పదకొండు గంటలకు చేరనయ్య ఉంటున్న ఊరిలోని ఆసుపత్రినుండే ఫోను వచ్చింది. ఒక ప్రమాదంలో గాయపడి చావుబతుకుల మధ్య ఉన్న ఒక మహిళ గుండె దానం చేయడానికి ఆమె భర్త అంగీకరించినట్టు వార్త. ఇది విన్న చేరనయ్య ఆనందపడ్డాడు. దేశంలో గుండెమార్చే ఆపరేషన్ చేసే తొలి వ్యక్తిగా నిలువనున్నందుకు సంతోషించాడు. మరునాడు ఉదయమే సంబంధిత వ్యక్తులతో మాట్లాడాడు. చట్టపరమైన ఇబ్బందులను తెలిపాడు. అయితే మరణిస్తున్న తన భార్య శరీరావయవాలు మరొకరికి జీవితాన్ని ప్రసాదించడం తనకు ఎంతో గర్వకారణం అని అతనన్నాడు. ఆపరేషన్ పూర్తయింది, రోగి కోలుకుని మరో పదేళ్లు బ్రతికింది.

అర్దం కానట్టు రఘుపతి వైపు చూశాను.
చెబుతానని, చేత్తో సైగ చేసి...
ఇంతకూ ఈ విషయంలో విశేషం ఏమిటని కదూ నీ చూపులకర్ధం అన్నాడు.
తల ఊపాను
ఓ క్షణం ఆగి, చేతితో నా చేయిపై తట్టి....
గుండె ఆపరేషన్ చేయించుకున్న మహిళ ముస్లీం. ఆమెకు తన గుండె దానం చేసిన స్త్రీ హిందువు. ఈ అపరేషన్తో చరిత్ర సృష్టించిన వైద్యుడు క్రిస్టియన్.
మతం మానవత్వానికి అడ్డుకాదు అనడానికి ఇది నిదర్శనం. అన్నాడు.
నా కళ్లు చెమ్మగిల్లాయి.
మరి మతంకోసం మారణకాండ సృష్టించడం ఎలా సాధ్యం.. ఆలోచిస్తున్నాను. . . .
టైం అయిపోయింది.. నేను వెళతానురా, అంటూ.. రఘుపతి బయలుదేరాడు.

---000---

No comments: